టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు రేపటి (జులై 23) నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో, ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టీమ్ ఇండియాకు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. సిరీస్లో ఇప్పటికే ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు, నిప్పులు చెరిగే మాటలు చోటుచేసుకున్న నేపథ్యంలో, తమ జట్టు మైదానంలో ఎదురయ్యే ఎలాంటి స్లెడ్జింగ్ కైనా భయపడబోదని స్పష్టం చేశాడు. మాటకు మాటతో సమాధానం ఇస్తామని తెలిపాడు.
ప్రస్తుతం ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ ప్రారంభం నుంచీ ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటూనే ఉంది. ముఖ్యంగా మూడో టెస్టులో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో, స్టోక్స్ తన జట్టు వైఖరిని స్పష్టం చేస్తూ, “మేము కావాలని ఏమీ మొదలుపెట్టం. కానీ ఒకవేళ మమ్మల్ని రెచ్చగొడితే, మేము వదిలిపెట్టం” అని పరోక్షంగా భారత్కు హెచ్చరికలు పంపాడు. మాటల యుద్ధం మొదలుపెడితే, మైదానంలో ‘సెగ’ ఎలా ఉంటుందో చూస్తారు అని స్టోక్స్ వ్యాఖ్యానించాడు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పరిస్థితులు, సిరీస్ ప్రాముఖ్యత దృష్ట్యా, నాలుగో టెస్ట్ మరింత ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనుంది. మరి ఈ ఉద్రిక్త వాతావరణంలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.