తెలంగాణలో ఎనుముల రాజ్యాంగం నడుస్తోందన్న శ్రవణ్
బీఆర్ఎస్ కార్యకర్తలపై 5 వేల కేసులు పెట్టారని మండిపాటు
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ కు ఏం పని అని ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఎనుముల రాజ్యాంగం నడుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై 5 వేల కేసులు పెట్టారని తెలిపారు. ఒక టీవీ ఛానల్ పై దాడి చేశారనే కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్యను ఏ25గా చేర్చారని చెప్పారు. స్టేషన్ కు రావాలంటూ ఆమెను పోలీసులు బెదిరిస్తున్నారని… ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
మన రాష్ట్రంలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి కూడా హక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డికి ఏం పని అని ప్రశ్నించారు. హోంశాఖపై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రివ్యూ చేయలేదని విమర్శించారు. రేవంత్ కు చేతకాకపోతే హోంశాఖను వేరేవారికి అప్పగించాలని అన్నారు. సిట్ పేరుతో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.