నిత్యానంద ఎక్కడున్నారో చెప్పిన శిష్యురాలు.. మద్రాసు హైకోర్టులో ఆసక్తికర పరిణామం

V. Sai Krishna Reddy
1 Min Read

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆచూకీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆయన ఆస్ట్రేలియా దేశానికి సమీపంలో తాను ఏర్పాటు చేసుకున్న “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)” అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారని ఆయన శిష్యురాలు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి తెలిపారు. మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో జారీ అయిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మదురై ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిత్యానంద అప్పీలు చేసుకున్నారు. ఈ కేసు నిన్న‌ మదురై ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నిత్యానంద తరఫున ఆయన శిష్యురాలు అర్చన హాజరై వాదనలు వినిపించారు. ఆస్ట్రేలియా దేశానికి దగ్గరలో ఉన్న “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” అనే ప్రత్యేక దేశంలో ప్రస్తుతం నిత్యానంద నివసిస్తున్నారని ఆమె కోర్టుకు తెలియజేశారు.

గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా “నిత్యానంద అసలు ఎక్కడ ఉన్నారు? ఆయన చెబుతున్న కైలాస దేశం ఎక్కడ ఉంది? అక్కడికి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ లాంటివి అవసరమా?” అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. తాజాగా శిష్యురాలు అర్చన చేసిన ప్రకటనతో నిత్యానంద ఆచూకీపై కొంత స్పష్టత వచ్చినట్లయింది.

అనంతరం నిత్యానంద తరఫున కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అర్చన ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ పరిణామంతో నిత్యానంద, ఆయన కైలాస దేశం మరోసారి వార్తల్లో నిలిచాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *