శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మినీ వ్యాను బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. దీంతో భార్యాభర్తలు మరణించారు. వివరాల్లోకి వెళితే.. దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో సోమవారం ఓ మినీ వ్యాను బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న ఈ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో దుకాణంలో ఉన్న వెంకటేశ్వర్లు, ఆయన భార్య స్వర్ణలత అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, నెల్లూరు నగరంలోని శ్రీనివాసనగర్లో జైహింద్ అనే పెయింటర్ హత్యకు గురయ్యాడు. జైహింద్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గత మూడు నెలలుగా ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి ఈ ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జైహింద్పై దాడి జరిగి హత్యకు గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.