ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు విమాన ప్రయాణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో పొరుగున ఉన్న కొన్ని ప్రాంతాలలో కూడా విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో తమ ప్రయాణికుల కోసం కీలకమైన సూచనలు జారీ చేశాయి.
ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా ఇరాన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్ మీదుగా ఉన్న గగనతలాలను మూసివేయాల్సి వచ్చింది. ఇది ఆసియా, యూరప్ మధ్య నడిచే కీలకమైన సుదూర విమాన మార్గాలను ప్రభావితం చేస్తోంది. దీంతో భారత్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ముఖ్యంగా అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ వెళ్లే పలు విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. ఇక, ఎయిర్ ఇండియా జారీ చేసిన ప్రకటనల ప్రకారం… గగనతల మూసివేత కారణంగా భద్రతాపరమైన ఆందోళనలతో విమానాలను దారి మళ్లించడం లేదా అవి బయలుదేరిన ప్రాంతానికే తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఉదాహరణకు లండన్ హీత్రో నుంచి ముంబయి వస్తున్న విమానాన్ని వియన్నాకు మళ్లించినట్లు సమాచారం.
మరోవైపు, ఇండిగో కూడా ప్రయాణికులకు ఒక సూచన జారీ చేసింది. విమానాల మార్గాలను సర్దుబాటు చేయడం వల్ల ప్రయాణ సమయం పెరగవచ్చని, కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చని పేర్కొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు తమ విమాన ప్రస్తుత స్థితిని ఎప్పటికప్పుడు విమానయాన సంస్థల వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్లలో తనిఖీ చేసుకోవాలని రెండు సంస్థలూ కోరాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైనప్పుడు తదుపరి సూచనలను జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా మధ్యప్రాచ్యం మీదుగా భారత్ నుంచి యూరప్ వెళ్లే ప్రయాణికులపై విమానాల దారి మళ్లింపు, ప్రయాణ సమయం పెరగడం వంటివి గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరిగితే, విమానయాన సంస్థలు, ప్రయాణికులు మరిన్ని అంతరాయాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ విమాన ప్రయాణాలకు సవాళ్లను విసురుతుండగా.. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఎయిర్ ఇండియా, ఇండిగో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తమ విమానయాన సంస్థల నుంచి వచ్చే తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని సూచించాయి.