ప్రభుత్వ యంత్రాంగంలో ఒకప్పుడు సాధారణ గుమాస్తాగా చేరిన వ్యక్తి కూడా తన ప్రతిభ, పనితీరుతో అత్యున్నత స్థాయికి, చివరకు కలెక్టర్గా కూడా పదోన్నతి పొందే అవకాశం ఉండేదని, కానీ నేటి పరిస్థితుల్లో అది ఊహించడం కూడా కష్టమని లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బ్యూరోక్రసీలో నెలకొన్న లోపాలు, వాటిని సరిదిద్దాల్సిన ఆవశ్యకతపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో ప్రభుత్వ వ్యవస్థలో ప్రతిభావంతులకు సముచిత స్థానం లభించేదని డా. జయప్రకాశ్ నారాయణ్ గుర్తుచేశారు. తాను ఐఏఎస్లో చేరిన సమయంలో (1980 ప్రాంతంలో) ఒక గుమాస్తాగా ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించిన వ్యక్తి, కేవలం తన సమర్థత ఆధారంగా కలెక్టర్గా పదవీ విరమణ చేశారని ఆయన ఉదహరించారు. “ఒక క్లర్క్ కలెక్టర్ కావడం అనేది ఆనాటి వ్యవస్థ ప్రతిభకు ఇచ్చిన విలువకు నిదర్శనం. కానీ, నేటి భారతదేశంలో ఒక క్లర్క్ ఐఏఎస్ అధికారిగా కలెక్టర్ అవ్వడం అసాధ్యం” అని ఆయన అన్నారు. కాలక్రమేణా ‘సోషలిస్ట్ జపం’ పేరుతో గుర్రానికి, గాడిదకు తేడా లేకుండా అందరికీ టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇచ్చే దుస్థితికి వ్యవస్థ దిగజారిందని ఆయన విమర్శించారు. పని చేసినా, చేయకపోయినా, లంచం తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఖాయమనే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యూరోక్రసీ నిర్వీర్యానికి కారణాలు:
ఐఏఎస్ వంటి సర్వీసులకు ఎంపికయ్యేవారు లక్షల మందిలో పోటీపడి అత్యంత ప్రతిభావంతులుగా వస్తున్నప్పటికీ, పది పదిహేనేళ్లలో వారు కూడా నిర్వీర్యం కావడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని డా. జయప్రకాశ్ నారాయణ్ విశ్లేషించారు.
డొమైన్ నైపుణ్యం అవసరం లేకపోవడం: ఈ రోజు విద్య, రేపు రక్షణ, ఎల్లుండి ఆర్థికం, ఆ తర్వాత టెక్నాలజీ.. ఇలా ఏ శాఖలోనైనా పనిచేయవచ్చనే వింత పోకడ మన ఉపఖండంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని ఆయన అన్నారు. ఏ ఒక్క మనిషి అన్ని రంగాల్లో నిష్ణాతుడు కాలేడని స్పష్టం చేశారు.
కీలక పదవులపై గుత్తాధిపత్యం: అన్ని కీలక పదవులను బ్యూరోక్రాట్లకే కేటాయించడం, బయట ఎంతటి నిపుణులున్నా వారి సేవలను వినియోగించుకోకపోవడం రెండో ప్రధాన లోపమని ఆయన పేర్కొన్నారు.
పనితీరుతో సంబంధంలేని ప్రమోషన్లు: పని చేసినా, చేయకపోయినా ఆటోమేటిక్గా ప్రమోషన్లు రావడం, ప్రతి ఒక్కరూ చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరుకోవడం వంటివి జరుగుతున్నాయని, దీనివల్ల పదవుల సంఖ్య పెరిగిపోతోందని అన్నారు. “ఒకప్పుడు రాష్ట్రమంతటికీ ఒక ఐజీ ఉంటే, ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఐజీలు ఉంటున్నారు. అందరూ చీఫ్ సెక్రటరీలు కాలేరు కాబట్టి, పదుల సంఖ్యలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ డీజీపీలు ఉంటున్నారు” అని ఆయన వివరించారు.
ఇదే తరహా పనితీరు ఒక ప్రైవేటు కంపెనీలో ఉంటే అది మూడేళ్లలో మూతపడి ఉండేదని డా. జయప్రకాశ్ నారాయణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో జీతాలిస్తోంది కాబట్టి, పని జరిగినా జరగకపోయినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక స్థాయి తర్వాత ప్రతిభ చూపకపోతే ఇంటికి పంపిస్తారని, కానీ ప్రభుత్వంలో అలా జరగడం లేదని, అందరినీ కొనసాగిస్తున్నారని తెలిపారు.
వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రతిభావంతులను గుర్తించి, వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలని, మిగిలిన వారిని అవసరమైతే ఇంటికి పంపించాలని డా. జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. బయట ఉన్న నిపుణుల సేవలను ఉపయోగించుకోవడానికి, కొంత పోటీతత్వం తీసుకురావడానికి ఉద్దేశించిన ‘లేటరల్ ఎంట్రీ’ వంటి ప్రతిపాదనలకు కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “మన బ్యూరోక్రసీ అద్భుతంగా పనిచేస్తుంటే, ప్రజలకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సేవలు అందుతుంటే ఇలాంటి ప్రయోగాలు ఎందుకని అడగవచ్చు. కానీ, ఆ పరిస్థితి ఉందా?” అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకు సేవలు అందించడం కోసమే ఉద్యోగులను నియమించామని, మనం కట్టే పన్నులతోనే వారికి జీతాలు ఇస్తున్నామన్న స్పృహ ఉండాలని డా. జయప్రకాశ్ నారాయణ్ ఉద్ఘాటించారు. ఉద్యోగాన్ని ఒక ప్రివిలేజ్గా, తమ హక్కుగా భావించే ధోరణి మారాలన్నారు. “బ్యూరోక్రాట్లు మనకు సేవ చేయడానికి ఉన్నారు. వారు సమర్థవంతంగా సేవ చేస్తున్నారా, లేదా అన్నదే ఏకైక ప్రమాణం కావాలి. సేవా దృక్పథంతో పనిచేసేవారిని ప్రోత్సహించాలి, ఆ నైపుణ్యాలున్న వారిని తయారుచేయాలి, సమాజంలో సమర్థులుంటే వారికి అవకాశమివ్వాలి” అని ఆయన హితవు పలికారు