దేశంలో రూ.500 విలువైన కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే… ‘క్యాపిటల్ టీవీ’ అనే యూట్యూబ్ ఛానెల్లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ అయింది. 2026 మార్చి నాటికి ఆర్బీఐ రూ.500 నోట్లను దశలవారీగా చలామణి నుంచి తొలగించనుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకు 4.5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం… ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని, వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వదంతులపై మరింత లోతుగా పరిశీలించగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో గానీ, ఇతర విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా గానీ రూ.500 నోట్ల రద్దుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని తేలింది. పీఐబీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ వైరల్ క్లెయిమ్ పూర్తిగా అబద్ధం అని ప్రకటించింది.
అయితే, ఈ గందరగోళానికి 2025 ఏప్రిల్ లో ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 విలువైన నోట్ల చలామణిని పెంచాలని ఆర్బీఐ ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఏటీఎంలలో 75 శాతం, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.
ఈ చర్య కేవలం ప్రజలకు రోజువారీ లావాదేవీల కోసం చిన్న డినామినేషన్ నోట్ల లభ్యతను మెరుగుపరిచేందుకేనని, రూ.500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించేందుకు దీనికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరెన్సీ విషయాలపై వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఆర్బీఐ మరియు ప్రభుత్వ అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.