భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో జమ్మూకశ్మీర్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ నగరం, పూంఛ్ ప్రాంతంలో 10-11 మధ్య రాత్రి ఎటువంటి డ్రోన్లు, కాల్పులు, షెల్లింగ్ ఘటనలు నమోదవలేదని, ఈ ఉదయం నాటికి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు. నిన్న పాకిస్థాన్ నుంచి జరిగిన తీవ్రస్థాయి షెల్లింగ్ ఘటనలతో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రశాంతత నెలకొంది. అయినప్పటికీ, సరిహద్దుల్లో భారత సాయుధ దళాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
కాగా, పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.