పాక్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడిన అమెరికా విదేశాంగ‌ కార్యదర్శి.. కీల‌క సూచ‌న‌

V. Sai Krishna Reddy
2 Min Read

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుక్రవారం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌తో మాట్లాడారు. భారత్‌తో ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇరుదేశాల మ‌ధ్య భవిష్యత్తులో ఘర్షణలను నివారించడానికి నిర్మాణాత్మక చర్చలకు అమెరికా సహాయం చేస్తుంద‌ని రూబియో చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇక‌, ఈ వారం ప్రారంభంలో రూబియో భార‌త‌ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌లతో విడివిడిగా మాట్లాడి, ఇరుదేశాలు ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతును అంతం చేయడానికి పాక్ క‌చ్చితమైన చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు.

అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరిన విష‌యం తెలిసిందే. “ఈ ఉద్రిక్తత వీలైనంత త్వరగా తగ్గుముఖం పట్టాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాలు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయని ఆయనకు తెలుసు” అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.

యుద్ధంలో తలదూర్చం.. దాంతో మాకు సంబంధం లేదు: జేడీ వాన్స్
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయ‌న‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ విస్పష్టంగా ప్రకటించారు. ‘భారత్‌, పాకిస్థాన్ దేశాలు అమెరికా నియంత్ర‌ణ‌లో లేవు. ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వస్త్ర దేశాలకు మేము సూచించగలం. దౌత్య మార్గాల ద్వారా ఇరుదేశాల‌కు ఈ విషయాన్ని తెలియ‌జేస్తాం’ అని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

భారత్-పాకిస్థాన్ మ‌ధ్య పెరిగిన‌ ఉద్రిక్తతలు
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లలో తొమ్మిది ప్రాంతాల‌ను లక్ష్యంగా చేసుకుని భారత్‌ సైనిక దాడి చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాయాది దేశం చేసిన డ్రోన్, క్షిపణి దాడులను భారత్ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టింది.

పాక్‌ తాజా రెచ్చగొట్టే చర్యగా జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్ వరకు అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబ‌డి భారత్‌లోని 26 ప్రదేశాలలో సాయుధ డ్రోన్లతో దాడికి పాల్ప‌డింది. పాకిస్థాన్ డ్రోన్ దాడులను భారత్‌ తిప్పికొట్టిన కొన్ని గంటల తర్వాత ఈరోజు ఉదయం శ్రీనగర్‌లో కూడా బహుళ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *