ఉద్యోగం మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకోవడం ఇకపై మరింత సులభతరం కానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, సరళీకరిస్తూ కీలక మార్పులు చేసింది. శుక్రవారం (ఏప్రిల్ 25, 2025) కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, కొన్ని సందర్భాలలో పీఎఫ్ బదిలీ క్లెయిమ్లకు యజమాని ఆమోదం అవసరం లేదు.
ఇప్పటివరకు, పీఎఫ్ ఖాతా బదిలీ ప్రక్రియలో రెండు ఈపీఎఫ్ కార్యాలయాల పాత్ర ఉండేది. ఒకటి నిధులు బదిలీ అయ్యే సోర్స్ ఆఫీస్, రెండోది నిధులు జమ అయ్యే డెస్టినేషన్ ఆఫీస్. అయితే, ప్రక్రియను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో, ఈపీఎఫ్ఓ మెరుగైన ఫారం 13 సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా డెస్టినేషన్ ఆఫీస్ వద్ద బదిలీ క్లెయిమ్ల ఆమోదం పొందాల్సిన అవసరాన్ని తొలగించారు.
ఈ కొత్త విధానం ప్రకారం, ఇకపై బదిలీ క్లెయిమ్కు సోర్స్ ఆఫీస్ ఆమోదం లభించగానే, సభ్యుడి పాత పీఎఫ్ ఖాతాలోని మొత్తం నిల్వలు వెంటనే వారి డెస్టినేషన్ ఆఫీస్కు ఆటోమేటిక్గా బదిలీ అవుతాయి. ఇది ఈపీఎఫ్ఓ సభ్యుల జీవన సౌలభ్యాన్ని పెంచడంలో కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అంతేకాకుండా, సభ్యుల ఖాతాల్లోకి నిధులు సత్వరమే జమ అయ్యేలా చూసేందుకు, సభ్యుల ఐడీ, ఇతర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పెద్ద సంఖ్యలో యూఏఎన్లను ఒకేసారి జనరేట్ చేసే సదుపాయాన్ని కూడా ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఫీల్డ్ ఆఫీసులకు అందుబాటులోకి తెచ్చారు.
దీనివల్ల ఈపీఎఫ్ఓ అప్లికేషన్లో ఆధార్ అవసరం లేకుండానే పాత బకాయిలను కూడా జమ చేయడానికి వీలవుతుంది. అయితే, పీఎఫ్ నిల్వల రక్షణకు, రిస్క్ను తగ్గించే చర్యగా, ఇలా జనరేట్ చేసిన యూఏఎన్లను ఆధార్తో అనుసంధానం చేసే వరకు హోల్డ్ లో ఉంచుతారు. ఆధార్ సీడింగ్ పూర్తయిన తర్వాతే అవి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి.