ఆఫ్రికన్ కంట్రీ సూడాన్లో జరుగుతున్న పౌర యుద్ధంలో 300 మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. జామ్జామ్, అబూషాక్ శిబిరాలపై గతవారం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) బలగాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో 300 మందికిపైగా పౌరులు మృతి చెందినట్టు ఐక్యరాజ్య సమితి మానవతా ఏజెన్సీ తెలిపింది. మృతుల్లో రిలీఫ్ ఇంటర్నేషనల్కు చెందిన మానవతా సిబ్బంది 10 మంది ఉన్నట్టు ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో 16 వేల మంది పౌరులు జామ్జామ్ శిబిరాన్ని విడిచిపెట్టినట్టు తెలిసింది.
సూడాన్లో 2023 నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 29,600 మంది మృతి చెందారు. కోటిమందికిపైగా సూడాన్ను వదిలిపెట్టారు.