కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో కార్యకర్తలు వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
చిదంబరం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసింది. దీంతో మంగళవారం రాత్రి చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన అనారోగ్యంపై వివరణ ఇచ్చారు. అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్కు గురయ్యానని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు సాధారణంగా ఉన్నాయని, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నారు.
మరోవైపు ఆయన కుమారుడు కార్తి చిదంబరం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్ కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. హృదయ, న్యూరో వైద్య నిపుణులతో సహా అత్యవసర వైద్య బృందం ఆయనను పరీక్షించిందని, అన్ని వైద్య పరీక్షలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన స్థానిక జైడస్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు