మహాత్మా గాంధీ మునిమనవడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

V. Sai Krishna Reddy
1 Min Read

సబర్మతి ఆశ్రమాన్ని ఆధునికీకరించాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ప్రాజెక్టుతో ఆశ్రమం రూపురేఖలు మారిపోతాయని, ఆశ్రమ విశిష్టత దెబ్బతింటుందని తుషార్ గాంధీ ఆరోపించారు. అయితే, కోర్టు ఆయన వాదనలను తోసిపుచ్చింది.

తుషార్ గాంధీ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం… పిటిషనర్‌ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ప్రాజెక్టును నిలిపివేయడానికి తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది. “ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి సహేతుకత కనిపించడం లేదు” అని పేర్కొంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల సబర్మతి ఆశ్రమాన్ని రూ.1200 కోట్లతో అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను గుజరాత్ హైకోర్టు గతంలో సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ తుషార్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

“మీరు మీ భావోద్వేగాలను ఈ అంశంతో ముడిపెట్టకూడదు. మనం ముందుకు సాగుతున్నాము, దేశం కూడా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి విషయాలను వేరే కోణంలో చూడాలి” అని కోర్టు తుషార్ గాంధీకి సూచించింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తాము ఈ నిర్ణయానికి వచ్చామని, ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *