ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ను దాటేశారు. ఈ తెల్లవారుజామున 5.50 గంటల సమయానికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం లభించింది. మ్యాజిక్ ఫిగర్ను దాటి 1,18,070 ఓట్లు సాధించారు. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యే సరికి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి.
మరోవైపు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన విజయం సాధించారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసే సరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28 వేల ఓట్లకు గాను ఆయన 16,520 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 5,818 ఓట్లు వచ్చాయి.