ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. దాంతోపాటే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపారు. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాను కూటమి ప్రభుత్వం ఆమోదించింది.
మరోవైపు ఫైబర్ నెట్ లో వివాదంపై నివేదిక సీఎం వద్దకు చేరింది. ఫైబర్ నెట్ ఎండి దినేశ్ కుమార్ ను బదిలీ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. దినేశ్ కుమార్ కు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఈ రెండు చర్యల ద్వారా… అటు పార్టీలో అయినా, ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం అనే బలమైన సంకేతాలను పంపించినట్టయింది