ఆ మహిళా వైద్యుల బృందం చేసిన విహార యాత్ర విషాదయాత్రగా మిగిలింది. సరదాగా ఈతకు దిగితే వారిలో ఒకరు గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యమైంది. మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నది వద్ద ఈ విషాదం జరిగింది. మృతురాలు హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల యువ వైద్యురాలు అనన్య రావు.
అనన్య రావుకు ఈత అంటే సరదా. తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి ఆమె హంపీ టూర్కు వెళ్లారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో విహరించి.. మంగళవారం రాత్రి నణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు తుంగభద్ర నదికి వెళ్లారు. ఈత కొట్టడాన్ని ఇష్టపడే అనన్యరావు ఏకంగా 25 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకారు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వెంటనే గజ ఈతగాళ్లు నీళ్లలోకి దూకి.. ఆమె కోసం రాత్రి దాకా గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. అనన్య రావు నీళ్లలోకి దూకిన వీడియోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.