విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కిన భార్యపై ఓ వ్యక్తి వినూత్నంగా పగ తీర్చుకున్నాడు. ఆమె పేరుతో ఉన్న బైక్తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి ఆమెకు జరిమానాల భారం వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్పూర్కు చెందిన యువతికి, బీహార్లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు రావడంతో ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ విడాకుల పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే వివాహ సమయంలో ఆ యువకుడికి యువతి తల్లిదండ్రులు ఒక బైక్ను కానుకగా ఇచ్చారు. అయితే ఆ బైక్ను మాత్రం తన కుమార్తె పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయినా ఆ యువకుడు మాత్రం బైక్ను తిరిగి ఇవ్వలేదు.
అతను ఆ బైక్పై తిరుగుతూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్కు సంబంధించి జరిమానా చలానాలను ఆ యువతికి పంపించారు. తన పేరు మీద బైక్ ఉండటంతో ఆమె తొలుత సమయం ప్రకారం చలానాలను కట్టేసింది. అయితే వరుసగా చలానాల భారం పెరుగుతుండటంతో భర్త కుట్ర అర్థమై ఆమె పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. గత మూడు నెలల్లోనే నాలుగు సార్లు చలానాలు వచ్చాయని ఆమె వాపోయింది. ఆ యువకుడు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ భార్యను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు.