బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్(Balmuri Venkat) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate)లో నిర్వహించిన సమీక్షా సమావేశం ఘటనపై బల్మూరి వెంకట్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్చోసిన ఆంబోతులాగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఒక రౌడీ, వీధి గుండా లాగా వ్యవహారశైలి ఉందని విమర్శించారు. కేవలం మీడియాలో కనబడడం కోసమే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళితులకు రెండో విడత దళితబంధు రావాలంటే తనను గెలిపిస్తేనే దళితబంధు వస్తుందంటూ బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడని గుర్తుచేశారు. దళితులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, ఎస్సీ కార్పొరేషన్లకు నిధులివ్వకుండా మోసం చేసింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఇలానే ప్రవర్తిస్తే రోడ్డుపై గుడ్డలూడదీసి కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.