సిద్ధిపేట,ఏప్రిల్ 01,(ప్రజాజ్యోతి) :సిద్దిపేట మున్సిపాలిటీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను వసూళ్లలో గణనీయమైన పురోగతి నమోదైంది. ఆర్థిక సంవత్సరపు చివరి ఒక్కరోజులోనే 35.02 లక్షల రూపాయల పన్నులు వసూలు చేయడం విశేషం.మున్సిపాలిటీకి మొత్తం 1877.80 రూపాయల లక్షల డిమాండ్ ఉండగా, అందులో1615.24 లక్షలు రూపాయలు వసూలు చేయబడినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పన్ను వసూలు శాతం సుమారు 86%గా నమోదైంది. గత సంవత్సరంలో ఇది 84.25% మాత్రమే ఉండగా, ఈసారి 1.75% వృద్ధి సాధించడం గమనార్హం.గత ఏడాది 1414.54 లక్షల పన్నులు వసూలు కాగా, ఈ సంవత్సరం 1615.54 లక్షలు వసూలు చేయడం ద్వారా సుమారు 2 కోట్ల మేర అధిక వసూళ్లు సాధించబడినాయి.ఈ సంవత్సరం కొత్తగా 995 ఇళ్లను ఆన్లైన్లో నమోదు చేసి ఇంటి నెంబర్లు కేటాయించారు. అదేవిధంగా 144.10 లక్షల అదనపు ఆదాయం కూడా సమకూరింది.పన్ను వసూళ్లలో నిర్ణయించిన లక్ష్యాన్ని అధిగమించడం వల్ల 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ పొందేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ అర్హత సాధించింది. రాష్ట్ర స్థాయిలో ఇంటి పన్ను వసూళ్లలో తొలి పది స్థానాల్లో సిద్దిపేట మున్సిపాలిటీ స్థానం సంపాదించడం విశేషంగా నిలిచింది.కమీషనర్ అశ్రిత్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేసి ఈ లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు.పన్ను వసూళ్లలో సహకరించిన పాలకవర్గ సభ్యులకు , పట్టణ ప్రజలకు కమీషనర్ అశ్రిత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
