హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్తుంటే జరిమానా విధించడం సాధారణం. కానీ, హైదరాబాద్లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులు దీనికి భిన్నంగా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనదారుల ప్రాణ రక్షణే లక్ష్యంగా ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో వినూత్న చొరవ తీసుకున్నారు. దీని కింద హెల్మెట్ లేని వారికి జరిమానా వేయకుండా అక్కడికక్కడే ఒక హెల్మెట్ను అందిస్తున్నారు.
సోమవారం సంగీత్ చౌరస్తాలో మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపి, వారి పేరు, ఫోన్ నంబర్, వాహనం వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం వారికి ‘హెల్మెట్ బ్యాంక్’ నుంచి ఒక హెల్మెట్ అందించి పంపిస్తారు. అయితే, 24 గంటల్లోగా వారు సొంతంగా కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి, పోలీసుల వద్ద తీసుకున్న హెల్మెట్ను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా డీసీపీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ “హెల్మెట్ ధరించడం బరువు కాదు, అదొక బాధ్యత. చిన్న పొరపాటు వల్ల ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకే జరిమానాల కన్నా, వాహనదారుల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం” అని తెలిపారు. మల్కాజిగిరి జోన్లోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ హెల్మెట్ బ్యాంకులు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. పోలీసుల ఈ కొత్త ప్రయత్నంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
