బాంబ్ సైక్లోన్’ దెబ్బకు అమెరికా విలవిల.. వేల విమానాలు రద్దు.. స్తంభించిన జనజీవనం

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు విస్తరించిన ఈ హిమపాతం వ‌ల్ల‌ కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుపాను అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా అభివర్ణించారు. తుపాను కేంద్రకంలో వాతావరణ పీడనం 24 గంటల్లో వేగంగా పడిపోయినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి.

సోమవారం విరుచుకుపడిన ఈ మంచు తుపాను కారణంగా న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో రెండు అడుగుల (60 సెంటీమీటర్లు) కంటే ఎక్కువ మంచు పేరుకుపోవడంతో రికార్డులు బద్దలయ్యాయి. న్యూయార్క్ నగరంలో గడిచిన ఆరేళ్లలో పూర్తిస్థాయిలో పాఠశాలలకు సెలవు ప్రకటించడం ఇదే తొలిసారి. అధికారులు పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

తీవ్రమైన గాలులు, హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ కుప్పకూలింది. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్‌లోని విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. మొత్తం మీద 5,600కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోడ్ ఐలాండ్‌లో విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు నగరాల్లో బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటకు 83 మైళ్ల (133 కిలోమీటర్లు) వేగంతో గాలులు వీచాయి.

న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో 19 అంగుళాల మేర మంచు నమోదైంది. రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో కొందరు పౌరులు స్కీయింగ్ చేస్తూ కనిపించగా, యూకే నుంచి వచ్చిన పర్యాటకులు టైమ్స్ స్క్వేర్ నడిబొడ్డున డ్యాన్స్ చేస్తూ కనిపించడం విశేషం. కనెక్టికట్‌లోని చారిత్రక నౌకల పైనుంచి మంచును తొలగించడానికి సిబ్బంది శ్రమించారు. ప్రస్తుతం ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతున్నప్పటికీ, ఈ వారం చివర్లో మరో మంచు తుపాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *