తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు!

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు (బీసీలు) అద్భుతమైన విజయాన్ని నమోదు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 61 శాతానికి పైగా వార్డులు, డివిజన్లను బీసీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వాస్తవానికి మున్సిపాలిటీల్లో బీసీలకు 28.22 శాతం, కార్పొరేషన్లలో 35.25 శాతం సీట్లు మాత్రమే రిజర్వ్ చేయగా, రిజర్వేషన్లను మించి జనరల్ స్థానాల్లోనూ వారు గెలుపొందడం విశేషం.

ఈ ఫలితాలపై బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్‌తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగూ బాలలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల్లో పెరిగిన రాజకీయ చైతన్యానికి ఈ విజయాలే స్పష్టమైన నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా, 13న ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీసీ అభ్యర్థులు 52.75 శాతం సీట్లు గెలుచుకున్నారని కమిషన్ గుర్తుచేసింది. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీసీలు భారీ సంఖ్యలో గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారని, వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని కమిషన్ పేర్కొంది. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులను ఆశ్రయించారని తెలిపింది. తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి వెంటనే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ కమిషన్ కోరింది. అలాగే, కోర్టులో కేసులు వేసిన వారు వాటిని ఉపసంహరించుకుని బీసీల అభ్యున్నతికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *