మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన గొర్రెలకాపరి నాగమ్మ

V. Sai Krishna Reddy
1 Min Read

జీవితం ఎప్పుడైనా మారిపోవచ్చనేదానికి ఇది మరో ఉదాహరణ. ఏమాత్రం చదువు లేని ఒక అమాయకురాలు ఊహించని విధంగా ప్రజాప్రతినిధి అయిపోయింది. వివరాల్లోకి వెళితే… నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఉండే బొడ్డేమొల్ల నాగమ్మ ప్రకృతిని నమ్ముకుని బతుకుతున్న ఒక సాధారణ గృహిణి. ఆమెకు చదువు లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అసలు తెలియదు. గొర్రెలను పెంచుతూ జీవనోపాధిని పొందుతున్న సామాన్యురాలు. కానీ, ఆమెను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నారాయణపేట మున్సిపాలిటీలో 19వ వార్డు నుంచి పోటీ చేయాలంటూ పట్టణ బీజేపీ నాయకత్వం ఆమెకు అవకాశం ఇచ్చింది. రాజకీయాలు తెలియని ఆమె… ధైర్యంగా తన భర్త అండతో ఎన్నికల బరిలోకి దిగింది. భర్తతో పాటు, వార్డులో ఉన్న యువత సహకారంతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసింది. తనను గెలిపిస్తే గృహిణులకు, వ్యవసాయదారులకు బీజేపీ తరపున అండగా ఉంటానని… అందరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రచారం చేసింది. చివరకు ఎన్నికల్లో ఆమె జయకేతనం ఎగురవేసింది. తన ప్రత్యర్థి సరిత సతీశ్ గౌడ్ పై 154 ఓట్ల మెజార్టీతో 19వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందింది. ఎన్నికల్లో గెలుపొందిన నాగమ్మను ఇతర పార్టీల నేతలు కూడా అభినందిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *