బాలికలతో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ ఘటన విశాఖ జిల్లా పాడేరు మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. పాడేరు మండలంలోని ఐనాడ పంచాయతీ రాయిపాలెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పాంగి సుబ్రహ్మణ్యం బాలికలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉపాధ్యాయుడు తమను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాలికలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో డీఈవో రామకృష్ణారావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి పాఠశాలను సందర్శించి, బాధిత బాలికలు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి విచారణ నిర్వహించారు. అనంతరం పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయుడు పాంగి సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేయడంతో పాటు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
