ఓఆర్ఆర్‌పై ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు బంద్.. పెరగనున్న టోల్ చార్జీలు

V. Sai Krishna Reddy
1 Min Read

.హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 1 నుంచి ఓఆర్ఆర్‌పై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇకపై ఫాస్టాగ్ లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే టోల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్యాష్‌లెస్ విధానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఆటోమేటిక్‌గా స్కాన్ అవుతుండగా, ఫాస్టాగ్ లేనివారు నగదు చెల్లించే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నగదు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నారు. అలాంటి వారు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఓఆర్ఆర్‌పై పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, కోకాపేట, శంషాబాద్‌తో సహా మొత్తం 19 ఇంటర్‌ఛేంజ్ టోల్ ప్లాజాలను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహిస్తోంది.

నగదు నిర్వహణ, రవాణా, భద్రపరచడం వంటి సమస్యలతో పాటు చిల్లర విషయంలో ప్రయాణికులకు, సిబ్బందికి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయని హెచ్‌జీసీఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత లోపించడం, దొంగతనాల వంటి భద్రతాపరమైన సమస్యలను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

రెండేళ్ల తర్వాత టోల్ రేట్ల పెంపు
మరోవైపు ఓఆర్ఆర్‌పై టోల్ చార్జీలను కూడా 2026 ఏప్రిల్ 1 నుంచి పెంచే అవకాశం ఉంది. చివరిసారిగా 2024 ఏప్రిల్‌లో టోల్ రేట్లను సవరించారు. వివిధ కారణాల వల్ల 2025 ఏప్రిల్‌లో పెంపును చేపట్టలేదు. దీంతో రెండేళ్ల విరామం తర్వాత సవరించిన టోల్ రేట్లు అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *