లక్షలాది మంది వినియోగదారులకు ఎయిర్టెల్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్స్క్రిప్షన్లను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసే వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ వెల్లడించింది.
గత ఏడాది ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందించింది. మార్కెట్లో సుమారు రూ.17 వేల విలువ ఉన్న ఈ ఏఐ సబ్స్క్రిప్షన్ను వినియోగదారులు ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా పొందారు. అయితే, ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఎయిర్టెల్ అప్పుడే తెలిపింది. గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ఆఫర్ను ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించింది.
జనవరి 16కు ముందు పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను కొనసాగించవచ్చు. అయితే, జనవరి 16 తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్ ఇక అందుబాటులో ఉండదు.
పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ ముగిసినప్పటికీ, ఎయిర్టెల్ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. తాజాగా ఎయిర్టెల్ అడోబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద, ఎయిర్టెల్కు చెందిన సుమారు 360 మిలియన్ల వినియోగదారులు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ పొందనున్నారు. సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.4 వేలు ఖర్చయ్యే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా అడోబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు సహా పలు ప్రీమియం సదుపాయాలను వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు.
