బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా?.. టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్!

V. Sai Krishna Reddy
1 Min Read

వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు.

భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రతా పరమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తప్పించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడం ఈ వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ ఐసీసీ ‘ద్వంద్వ ప్రమాణాలు’ పాటిస్తోందని మండిపడుతోంది. గతంలో భారత్-పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించినప్పుడు, బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గలేదని పీసీబీ ప్రశ్నిస్తోంది.

ఈ విషయంలో ‘అన్ని ఆప్షన్లను’ సిద్ధంగా ఉంచుకోవాలని పీసీబీని ప్రధాని షరీఫ్ ఆదేశించారు. ప్రస్తుతం పాక్ ముందు మూడు దారులు ఉన్నాయి. టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకోవడం, టోర్నీలో పాల్గొంటూనే, భారత్‌తో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను బహిష్కరించడం, నిరసన వ్యక్తం చేస్తూనే టోర్నీలో యథావిధిగా ఆడటం.

ఒకవేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఐసీసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పీసీబీకి అందే నిధుల్లో కోత విధించడంతో పాటు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడకుండా నిషేధించడం వంటి ‘మునుపెన్నడూ లేని’ ఆంక్షలు విధించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్ తప్పుకుంటే వారి స్థానంలో ఉగాండా (21వ ర్యాంక్) టోర్నీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాక్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించినప్పటికీ, అది కేవలం సాంకేతికం మాత్రమేనని, ప్రభుత్వ అనుమతి ఉంటేనే టీమ్ ప్రయాణిస్తుందని నఖ్వీ స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *