బొడ్రాయికి తొలి బోనం సమర్పించిన కుమ్మర కులస్తులు
వరంగల్ సిటీ, జనవరి 23(ప్రజాజ్యోతి):
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గ్రామ దేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నెహ్రూ కూడలిలో రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్.వై.ఎఫ్), ఉత్సవ కమిటీ మరియు రామాలయం వద్ద కొల్లూరి రిషినంద్ ట్రస్ట్, శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం రెండు చోట్ల తొలి బోనాన్ని కుమ్మర(శాలివాహన) కులానికి చెందిన భక్తులు సమర్పించారు. ప్రతి సంవత్సరం బొడ్రాయి దేవతకు మొదటి బోనం కుమ్మర కులస్తుల చేతుల మీదుగానే జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, డప్పు చప్పుళ్ళ నడుమ బోనాన్ని బొడ్రాయి వద్దకు తీసుకువచ్చారు. గ్రామ సుభిక్షం, పంటలు పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని బొడ్రాయి దేవతను ప్రార్థించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కుమ్మర కుల పెద్దలు మాట్లాడుతూ గ్రామదేవతలకు తొలి బోనం కుమ్మరి కులస్తులు పెట్టడం అనాదిగా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. దానిని కొనసాగిస్తూనే నేటితరం వారు కూడా గ్రామదేవతలకు తొలి బోనం పెట్టి సర్వజనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహనులు ఆవునూరి కుమారస్వామి, రవి, లక్ష్మీ, సుధాకర్, రమేష్, కుమార్, బిక్షపతి, శ్రీనివాస్, క్రిష్ణ, రాజు, మల్లేశం, రాజన్న, వెంకటేశం, దేవేందర్, మోహన్, సురేష్, హరీష్, వంశీ, వీరేశం మరియు ఆర్ వై ఎఫ్ బాధ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

