హైదరాబాద్ మెట్రో రద్దీకి చెక్.. ఇక 6 కోచ్‌ల రైళ్లు

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఊరట లభించనుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల రైళ్ల స్థానంలో ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు తొలి దశలో 10 కొత్త ఆరు కోచ్‌ల రైళ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ప్రస్తుతం రద్దీ సమయాల్లో మూడు కోచ్‌ల రైళ్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఆరు కోచ్‌ల రైళ్లు అందుబాటులోకి వస్తే, ఒకే ట్రిప్పులో ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపు అవుతుంది. దీంతో ప్లాట్‌ఫారమ్‌లపై నిరీక్షణ సమయం తగ్గడమే కాకుండా, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గ్లోబల్ టెండర్లను పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు ఎల్&టీ నుంచి మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఈ బదిలీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించేందుకు ఐడీబీఐ క్యాపిటల్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించారు. మెట్రో ఆస్తులు, అప్పులు, నిర్వహణ ఖర్చులపై ఆ సంస్థ వారం రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. స్వాధీన ప్రక్రియ పూర్తికాకముందే, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్‌ల కొనుగోలును పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెట్రో రెండో దశ విస్తరణ పనులు కూడా ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక మార్పు కానుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *