- ఎస్ఐ రంజిత్ రెడ్డి
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) రహదారి నిబంధనలు పాటించడం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యతతో కూడిన సామాజిక ఉద్యమం కావాలని నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించినప్పుడే ప్రమాదాలను నివారించగలమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పాటు బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు ఆవరణ, తహశీల్దార్, ఎంపీడీవో మరియు మున్సిపల్ కార్యాలయాలను ఎస్ఐ సందర్శించి, ఆయా కార్యాలయాల్లోని సిబ్బంది మరియు ప్రజలతో కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా ఉంటూ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంట ఏఎస్ఐ సుందర్ రాజు, పోలీస్ సిబ్బంది బిక్షపతి, రాజు యాదయ్య పాల్గొన్నారు.
