మళ్లీ మొరాయించిన ‘ఎక్స్’… సేవలకు అంతరాయం

V. Sai Krishna Reddy
1 Min Read

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ మరోసారి మొరాయించింది. శుక్రవారం సాయంత్రం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ టైమ్‌లైన్లు ఖాళీగా కనిపించడం, కొత్త పోస్టులు లోడ్ కాకపోవడంతో యూజర్లు ఆందోళనకు గురయ్యారు.

అంతరాయాలను పసిగట్టే ‘డౌన్‌డిటెక్టర్’ వెబ్‌సైట్ ప్రకారం, ఈ సమస్యపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అమెరికాలో దాదాపు 2 లక్షల మంది, యూకేలో 11,000 మంది, భారత్‌లో 3,000 మందికి పైగా యూజర్లు సమస్యలను రిపోర్ట్ చేశారు. యాప్‌లోకి లాగిన్ అవ్వలేకపోవడం, డైరెక్ట్ మెసేజ్‌లు తెరుచుకోకపోవడం, పేజీ రిఫ్రెష్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

కంటెంట్ డెలివరీ, భద్రతా సేవలు అందించే క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ అంతరాయానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే, ఈ ఘటనపై ఎక్స్ యాజమాన్యం గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సమస్య ఎక్స్‌లో అనుసంధానమైన ‘గ్రాక్’ అనే ఏఐ చాట్‌బాట్‌పైనా ప్రభావం చూపింది.

ఈ వారంలో ఎక్స్ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత మంగళవారం కూడా కొన్ని గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. తరచూ తలెత్తుతున్న ఈ సాంకేతిక సమస్యలు ప్లాట్‌ఫాం స్థిరత్వంపై యూజర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *