- వర్ధన్నపేట అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవంగా మెట్ల పూజ, జ్యోతి దర్శనం.
వర్ధన్నపేట జనవరి 16, ప్రజా జ్యోతి::
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం, ఆకేరు వాగు ఒడ్డున గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మకర విలక్కు పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెట్ల పూజ, జ్యోతి దర్శనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఖాదీ పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ లోకక్షేమం కోసం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప స్వామికి మెట్ల పూజ – జ్యోతి దర్శనం నిర్వహించామన్నారు. శబరిమల యాత్రకు వెళ్లలేని భక్తులు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారని తెలిపారు.
భక్తి శ్రద్ధలతో అయ్యప్ప భక్తులు 18 మెట్లపై దీపాలు వెలిగించి, మంగళహారతులు సమర్పించి స్వామివారిని స్మరించుకున్నారు. హరిహరసుతుని నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, గురుస్వాములు పాల్గొన్నారు.

