రాంగ్‌రూట్‌లో వస్తే బండి సీజ్.. తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ స్పెషల్ డ్రైవ్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలో రహదారి భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 74 ప్రమాదాలు జరుగుతుండగా, సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గణాంకాలు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది రోజుకు సగటున 52 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 72 వేలకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ ప్రమాద ఘంటికల నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కేవలం జరిమానాలతో మార్పు సాధ్యం కాదని భావించి, నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అరైవ్.. అలైవ్’ (Arrive.. Alive) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. అతివేగం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి తీవ్రమైన తప్పిదాలపై ప్రత్యేక నిఘా పెట్టింది.

రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ముఖ్యంగా హైవేలపై రాంగ్‌రూట్‌లో ప్రయాణించే వాహనాలను అక్కడికక్కడే స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నారు. కేవలం శిక్షలే కాకుండా, మానవీయ కోణంలోనూ మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారి ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాల అనుభవాలను వాహనదారులతో పంచుకునే కార్యక్రమాలు చేపట్టనున్నారు. వారి ఆవేదనను వినడం ద్వారానైనా వాహనదారుల్లో మార్పు వస్తుందని, తద్వారా రహదారులను సురక్షితంగా మార్చవచ్చని పోలీసులు ఆశిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *