నేడు బీజేపీలో చేరుతున్న ప్రముఖ నటి ఆమని

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ సినీనటి ఆమని రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఆమె ఈరోజు బీజేపీలో అధికారికంగా చేరనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ చేరిక కార్యక్రమం జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమని రాజకీయ ప్రవేశంపై ఆసక్తి నెలకొంది.

ఇటీవలే ఆమని బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఆమె పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్షతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలపై ఆమె ఆసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆమని చేరికతో పార్టీకి సినీ రంగంలో మరింత బలం చేకూరుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఆమెకున్న ప్రజాదరణ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఆమనితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ చేరిక కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. రానున్న రోజుల్లో ఆమని రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తారు, పార్టీ ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *