హైదరాబాద్-బెళగావి రైలుకు శంకర్‌పల్లి వద్ద తప్పిన ప్రమాదం

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళుతున్న ప్రత్యేక రైలు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు బోగీ కింద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు (నం. 07043) శంకర్‌పల్లి స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని మొదటి జనరల్ బోగీ కింద నుంచి ఒక్కసారిగా మంటలు, పొగలు రావడాన్ని కొందరు ప్రయాణికులు గమనించారు. వారు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో అధికారులు రైలును నిలిపివేశారు.

వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక తనిఖీల్లో బ్రేక్ జామ్ కావడం వల్లే రాపిడి జరిగి నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.

మంటలను పూర్తిగా ఆర్పేసి, సాంకేతిక నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రయాణికుల అప్రమత్తత, సిబ్బంది సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *