తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: చనిపోయిన వ్యక్తికి అత్యధిక ఓట్లు

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రజల అభిమానం ముందు కొన్నిసార్లు నిబంధనలు కూడా చిన్నబోతాయని నిరూపించే ఘటన ఇది. బతికి ఉన్నప్పుడు ప్రజల మనసు గెలుచుకున్న ఓ వ్యక్తి, మరణించిన తర్వాత కూడా ఎన్నికల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి (50) మరణించినా, గ్రామస్థులు ఆయనకే పట్టం కట్టారు.

వివరాల్లోకి వెళితే.. చింతలతాన ఆర్&ఆర్ కాలనీకి చెందిన చెర్ల మురళి, గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గతంలో వార్డు సభ్యుడిగా పనిచేసి ప్రజలకు సుపరిచితుడయ్యారు. ఈసారి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో బీఆర్ఎస్ మద్దతుతో ఆయన బరిలో నిలిచారు. ప్రచారంలో ముందంజలో ఉంటూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయితే, డిసెంబర్ 4న ఆయన ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు.

అభ్యర్థి మరణించినప్పటికీ, పోటీలో మరో ఐదుగురు ఉండటంతో ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించారు. గ్రామస్థులు మాత్రం మురళిపై ఉన్న అభిమానంతో ఆయనకే ఓట్లు వేశారు. ఫలితంగా సమీప అభ్యర్థిపై 358 ఓట్ల మెజారిటీతో మురళి విజయం సాధించారు. గెలిచిన అభ్యర్థి భౌతికంగా లేకపోవడంతో అధికారులు తదుపరి ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా లేక ఉపసర్పంచికే బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అనూహ్య ఫలితం గ్రామస్థుల్లో ఏకకాలంలో ఆనందాన్ని, విషాదాన్ని నింపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *