నేటితో మెట్రోకు 8 ఏళ్లు.. 80 కోట్ల మంది ప్రయాణం

V. Sai Krishna Reddy
1 Min Read

నగరవాసులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని నేటితో ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మెట్రో, ఇప్పుడు రెండో దశ విస్తరణకు సిద్ధమవుతోంది.

 

ప్రస్తుతం నగరంలో 69.2 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందిస్తోంది. నిత్యం సుమారు 4.80 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 51.5 శాతం మంది ఉద్యోగులే ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు 30.3 శాతం మంది, విద్యార్థులు 6.1 శాతం మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. 2017 నవంబర్ 29న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 80.21 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించినట్లు అంచనా. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది.

 

2012లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో రూ.14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండో దశ విస్తరణపై దృష్టి సారించింది. మొత్తం ఎనిమిది కారిడార్లలో 163 కిలోమీటర్ల మేర కొత్త లైన్లను రూ.43,848 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చి నాటికి వీటికి అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండో దశ పూర్తయితే మహానగర రవాణా వ్యవస్థలో మెట్రో మరింత కీలకం కానుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *