జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వేలపై కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

V. Sai Krishna Reddy
1 Min Read

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకున్నప్పటికీ, ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వేల్లోనూ స్పష్టత రావడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తమ హామీల గురించి ప్రస్తావించడం లేదని, ఇచ్చిన గ్యారంటీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ఉచిత బస్సు పథకం గురించి మాట్లాడుతున్నారని, అన్ని సమస్యలకు అదే పరిష్కారమన్నట్లు వ్యవహరించడం వారి మూర్ఖత్వమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువ వాటా కేంద్రానిదేనని, ఆ పథకాన్ని ఆపేస్తామని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు.

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో ఉండే కనీస అభివృద్ధి కూడా ఇక్కడ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా నిధులు లేవని విమర్శించారు. గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైందని గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, బీఆర్ఎస్‌పై నమ్మకం లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేకపోతున్నారని, ఈ గందరగోళం సర్వేల్లోనూ ప్రతిబింబిస్తోందని ఆయన విశ్లేషించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *