రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్… డీజీపీకి నోటీసులు

V. Sai Krishna Reddy
1 Min Read

నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌ను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నివేదికను సమర్పించాలని డీజీపీకీ ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్‌లో జరిగిన సంఘటన గురించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను మానవ హక్కుల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.

నిందితుడు రియాజ్ సాయుధ రిజర్వ్ కానిస్టేబుల్ సర్వీస్ ఆయుధాన్ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించాడని, ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని, ఫలితంగా అతను మరణించాడని పోలీసులు చెబుతున్నారు. ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందినట్లు డీజీపీ కూడా ప్రకటించారు.

రియాజ్ ఎన్‌కౌంటర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే హక్కుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని ఈ సందర్భంగా మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. నవంబర్ 24వ తేదీ లోగా ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులను, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం నివేదికను అందజేయాలని డీజీపీని ఆదేశించింది.

అక్టోబర్ 17న నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను రౌడీషీటర్ రియాజ్ పొడిచి చంపాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళుతుండగా రియాజ్ కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో రియాజ్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన రియాజ్‌ను పోలీసులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *