కానిస్టేబుల్ ను పొడిచి చంపిన నిందితుడు దొరికాడు!

V. Sai Krishna Reddy
2 Min Read

నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు. రెండు రోజుల క్రితం కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి చంపిన పాత నేరస్థుడు షేక్ రియాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఓ సామాన్య పౌరుడి సాహసంతో నిందితుడిని పట్టుకోవడం గమనార్హం.

నిజామాబాద్ 6వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ వద్ద రియాజ్ ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన రియాజ్‌ను, అక్కడే ఉన్న ఆసిఫ్ అనే యువకుడు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్‌పై దాడికి తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ పెనుగులాటలో రియాజ్, ఆసిఫ్ ఇద్దరికీ గాయాలవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని ఎన్‌కౌంటర్ చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఖండించారు. రియాజ్‌ను ప్రాణాలతోనే పట్టుకున్నామని, అతనిపై కాల్పులు జరిపినట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

అక్టోబర్ 17వ తేదీ రాత్రి ఓ బైక్ దొంగతనం కేసులో కానిస్టేబుల్ ఇ. ప్రమోద్ (42), తన మేనల్లుడితో కలిసి రియాజ్‌ను పట్టుకున్నారు. బైక్‌పై తమ మధ్యలో నిందితుడిని కూర్చోబెట్టుకుని తీసుకెళుతుండగా, 24 ఏళ్ల రియాజ్ అకస్మాత్తుగా కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మేనల్లుడిని కూడా పొడిచాడు. అనంతరం తన స్నేహితుల సహాయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, రియాజ్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి రెండు రోజుల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు విజయం సాధించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *