బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన ‘కారు’ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ గుర్తు అయిన తామర పువ్వుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తనదైన శైలిలో బదులిచ్చారు. “బుద్ధి సరిగ్గా లేని వారే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదని మాట్లాడుతారు. బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి అందరూ తామర పువ్వుతో సంబంధం ఉన్నవారే. నీరు ఎంత పెరిగినా తామర పువ్వు నీటికి అంటకుండా పైనే ఉంటుంది. మా పార్టీ కూడా అలాగే అన్ని సమస్యలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకోవాలంటూ కేటీఆర్కు హితవు పలికారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. “కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్లు తమ పరిస్థితిని తాము చూసుకోవాలి. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్కు కూడా పనికిరాకుండా షెడ్డులో పడింది” అని ఎద్దేవా చేశారు. కనీసం సెకండ్ హ్యాండ్లో ఆ కారును కొనడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.