జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి.. ఖరారు చేసిన అధిష్ఠానం?

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పలువురు నేతల పేర్లను పరిశీలించిన పార్టీ జాతీయ నాయకత్వం, చివరికి దీపక్‌రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జూబ్లీహిల్స్ బరిలో నిలిపే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శనివారమే దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపించారు. దీనిపై ఆదివారం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా, నియోజకవర్గంలో లక్ష మందికి పైగా ఉన్న ముస్లిం ఓటర్లను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థి ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన మాధవీలత పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలోనూ రాష్ట్ర నాయకత్వం పంపిన జాబితాపై చర్చించి, అందరిలోకెల్లా దీపక్‌రెడ్డి అభ్యర్థిత్వానికే తుది ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అన్ని లాంఛనాలు పూర్తయినందున, త్వరలోనే దీపక్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *