నేను ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు: మంత్రి సీతక్క

V. Sai Krishna Reddy
1 Min Read

మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి వస్తున్న వార్తలపై రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయన్న మీడియా కథనాలపై మంత్రి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా ఆ వివాదానికి స్వస్తి పలకాలని కోరానే తప్ప తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. ఆదివాసీ వీరవనితలు సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి వివాదం లేదా అపార్థం ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా తన బాధ్యత మేరకు మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు.

మేడారం ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవని మంత్రి సీతక్క అన్నారు. పనులు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాలని ఆకాంక్షించారు. మేడారం ఆలయ అభివృద్ధి మన అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల సమన్వయంతో ఆలయ అభివృద్ధి పనులను సజావుగా కొనసాగిస్తున్నదని మంత్రి వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *