నా శాఖలో ఆయన జోక్యమేంటి?.. పొంగులేటిపై కొండా సురేఖ ఫైర్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రతిష్ఠాత్మక మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సుమారు రూ.71 కోట్ల విలువైన మేడారం అభివృద్ధి పనుల టెండర్‌ను తన అనుచరుడికి కట్టబెట్టేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తన శాఖ పరిధిలోని విషయాల్లో ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి జోక్యం చేసుకోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కూడా పొంగులేటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

రాబోయే మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని, ఆలయ అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా మేడారం సందర్శించి, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కీలక సమయంలో ఇద్దరు మంత్రుల మధ్య టెండర్ల వివాదం తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *