పసిడి ప్రియులకు భారీ షాక్.. ఒక్కరోజే రూ.2,700 పెరుగుదల

V. Sai Krishna Reddy
2 Min Read

పండగ సీజన్‌లో చుక్కలనంటుతున్న బంగారం, వెండి
10 గ్రాముల ధర రూ.1.23 లక్షలు దాటి ఆల్‌టైమ్ రికార్డు
కిలో వెండి ధర రూ.1.57 లక్షలకు చేరి సరికొత్త గరిష్టం

పండుగల సీజన్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. ఈ విలువైన లోహాల ధరలు సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.23 లక్షల మార్కును దాటగా, కిలో వెండి కూడా రూ.1.57 లక్షలకు పైగా పలికి ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది.

ఢిల్లీ బులియన్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల స్వచ్ఛమైన (99.9 శాతం) బంగారంపై రూ.2,700 పెరిగింది. దీంతో రూ.1,23,300 వద్ద జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. అదేవిధంగా, కిలో వెండి ధరపై ఏకంగా రూ.7,400 పెరగడంతో, దాని రేటు రూ.1,57,400 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ధరల పెరుగుదలతో పండగ కొనుగోళ్లు చేయాలనుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు పలు దేశీయ, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవడం (యూఎస్ షట్‌డౌన్), డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం వంటివి పసిడి ధరలకు రెక్కలు తొడిగాయి. వీటికి తోడు ఫ్రాన్స్, జపాన్‌లలో నెలకొన్న రాజకీయ పరిణామాలు కూడా విలువైన లోహాల వైపు మదుపరులు మొగ్గు చూపేలా చేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి జోరు కొనసాగుతోంది. ఔన్సు (సుమారు 31.10 గ్రాములు) బంగారం ధర తొలిసారిగా 3,900 డాలర్ల మైలురాయిని దాటింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు కూడా ఈ ర్యాలీకి ఊతమిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే, త్వరలోనే ఔన్సు బంగారం ధర 4,000 డాలర్లను కూడా అధిగమించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *