మావోయిస్టు పార్టీలో కలకలం: పొలిట్ బ్యూరోకు అగ్రనేత మల్లోజుల రాజీనామా

V. Sai Krishna Reddy
1 Min Read

మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు రేగాయి. ఆ పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని క్యాడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈ పదవిలో కొనసాగే అర్హత తనకు లేదని భావించి పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ఆయన ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ ఇప్పటివరకు అనుసరించిన పంథా పూర్తిగా తప్పని, దీనివల్ల ఉద్యమం తీవ్రంగా నష్టపోయిందని అంగీకరించారు. ఉద్యమాన్ని ఓటమి పాలుకాకుండా కాపాడలేకపోయినందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం ఒక టీకా లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆయుధాలు వీడాలనే నిర్ణయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జీవించి ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చ జరిగిందని గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీ అధికార ప్రతినిధి జగన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఫాసిస్టు పరిస్థితుల్లో సాయుధ పోరాటం ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని స్పష్టం చేశారు. అనవసర త్యాగాలకు ఇకనైనా ముగింపు పలికి, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని క్యాడర్‌కు ఆయన సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *