ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్పై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. టిబెట్ వైపున సంభవించిన భారీ మంచు తుపాను కారణంగా దాదాపు వెయ్యి మంది పర్వతారోహకులు పర్వతంపైనే చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా కిందకి తీసుకువచ్చేందుకు అధికారులు, స్థానిక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.
సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 350 మందిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చి, క్యుడాంగ్ అనే సమీప పట్టణానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే, భారీగా మంచు చరియలు విరిగిపడటంతో మార్గాలన్నీ పూర్తిగా మూసుకుపోయాయి. వాటిని తొలగించేందుకు వందలాది మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టిబెట్ వైపున ఉన్న ఎవరెస్ట్ తూర్పు వాలుపై శుక్రవారం సాయంత్రం మొదలైన హిమపాతం, ఆదివారం నాటికి భీకరమైన మంచు తుపానుగా రూపుదాల్చింది. ప్రస్తుతం చైనాలో జాతీయ సెలవులు కొనసాగుతుండటంతో, ఎవరెస్ట్ను అధిరోహించేందుకు పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు, హైకర్లు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో తుపాను విరుచుకుపడటంతో వారంతా వివిధ క్యాంప్ సైట్లలో చిక్కుకుపోయినట్లు తెలిసింది.
పర్వతంపై చిక్కుకున్న వారు తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత అత్యంత వేగంగా పడిపోవడం) బారిన పడినట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు, శనివారం నుంచే ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు కొత్తగా అనుమతులు ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణంగా అక్టోబర్ నెలలో ఈ ప్రాంతంలో వాతావరణం కఠినంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.