ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఫోకస్.. విచారణకు రంగం సిద్ధం

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. తన విదేశీ పర్యటనకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన భావిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో విచారణ చేపట్టేందుకు స్పీకర్ కార్యాలయం సిద్ధమైంది.

నోటీసులు అందుకున్న వారిలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడంతో, వారి విచారణను అక్టోబర్ 5వ తేదీలోగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ అక్టోబర్ 6 నుంచి 23 వరకు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు కోసం బార్బడోస్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ముందే కీలకమైన ఈ విచారణ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విచారణలో భాగంగా వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకోవాలని స్పీకర్ కార్యాలయం ఇరుపక్షాలకు ఇటీవల మెమో జారీ చేసింది. దీనికి స్పందనగా, తమ తరపున న్యాయవాదిని నియమించుకున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్షం ప్రతినిధి శుక్రవారం స్పీకర్ కార్యాలయానికి లేఖ అందించినట్లు తెలుస్తోంది.

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే సోమవారం నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రోజుకు ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున నాలుగు రోజుల్లో 8 మంది విచారణను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌పై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *