బతుకమ్మ కుంటకు హైడ్రా పునరుజ్జీవం.. పిక్నిక్ స్పాట్‌గా మారిన చెరువు.. నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం

V. Sai Krishna Reddy
1 Min Read

బాగ్‌అంబర్‌పేటలో సరికొత్త అందాలు సంతరించుకున్న బతుకమ్మ కుంట నేడు ప్రజలకు అందుబాటులోకి రానుంది. కబ్జాలతో కుచించుకుపోయి, రూపురేఖలు కోల్పోయిన ఈ కుంటను హెచ్‌ఎండీఏ రూ.7.15 కోట్ల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దింది. ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సాయంత్రం 6 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఒకప్పుడు ఈ కుంట జలకళతో విలసిల్లేది. 1962-63 నాటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం, బాగ్‌అంబర్‌పేటలోని సర్వే నంబర్ 563లో బతుకమ్మ కుంట 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం 16.13 ఎకరాలుగా ఉండేది. అయితే, కాలక్రమేణా ఆక్రమణల బారిన పడి కేవలం 5.15 ఎకరాలకు పరిమితమైంది. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలతో నిండిపోయి తన ఉనికినే కోల్పోయే స్థితికి చేరింది.

మిగిలిన భూమిపై కూడా కొందరు ప్రైవేటు వ్యక్తులు తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ రికార్డులు, ఆధారాలను పరిశీలించిన కోర్టు, ఆ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో హెచ్‌ఎండీఏ పునరుద్ధరణ పనులు చేపట్టింది.

నేడు ఈ కుంట ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆటస్థలం, ఆహ్లాదంగా గడిపేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. తాజాగా సందర్శకుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు అక్కడ బతుకమ్మ వేడుకలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఓ నీటి వనరు, ప్రభుత్వ చొరవతో తిరిగి జీవం పోసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *