లాటరీలో రూ.కోటి గెలుచుకున్న అమెరికా మహిళ.. అదే వేదికపై విరాళమిచ్చేసిన వైనం

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. లాటరీలో 1.5 లక్షల డాలర్లు (రూ.1.3 కోట్లకు పైనే) గెలుచుకుంది. ఆ సొమ్ము అందుకున్న తర్వాత అదే వేదికపై ఆ మహిళ చేసిన పనికి అక్కడ ఉన్నవారంతా జేజేలు కొట్టారు. ఆమె దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని అక్కడికక్కడే విరాళంగా ఇచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

వర్జీనియాకు చెందిన క్యారీ ఎడ్వర్డ్స్ కు ఇటీవల పవర్ బాల్ ప్రైజ్ తగిలింది. లక్షన్నర డాలర్లు గెలుచుకున్న ఎడ్వర్డ్స్ ఎంతో సంతోషించింది. అయితే, కేవలం అదృష్టం కలిసి వచ్చి చేతికందిన సొమ్మును తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం సబబు కాదని భావించింది. తను గెలుచుకున్న డబ్బు నలుగురికీ ఉపయోగపడాలని భావించినట్లు క్యారీ ఎడ్వర్డ్స్ తెలిపింది. దీంతో లాటరీ సొమ్ము మొత్తాన్ని మూడు ఎన్జీవోలకు సమానంగా పంచేసింది. అందులో తాను వాలంటీర్ గా సేవలందిస్తున్న సంస్థ కూడా ఉండడం విశేషం.

క్యారీ ప్రకటన విన్న వెంటనే లాటరీ యాజమాన్యంతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు ఎంతోమంది తమ లాటరీ గెలుచుకున్నా, అతి తక్కువ మంది మాత్రమే ఇలా ప్రైజ్ మనీ మొత్తం దానమిచ్చారని చెప్పారు. ఆ లాటరీలో వాటా అందుకున్న ఎన్జీవో ప్రతినిధి మాత్రం క్యారీ ప్రకటన తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదన్నారు. వాలంటీర్ గా ఆమెను కొన్నేళ్లుగా దగ్గరి నుంచి చూస్తున్నానని, ఆమె నిస్వార్థ సేవ గురించి తెలుసు కాబట్టి ఇలా డొనేట్ చేయకుంటేనే ఆశ్చర్యపోయేవాడినని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *